Gita Chapter 17 Verse 7

 

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః |
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ||

*ప్రతి పదార్థం*

ఆహారః – ఆహారము; తు – నిశ్చయముగా; అపి – కూడా; సర్వస్య – ఎల్లవారికిని; త్రివిధః – మూడువిధములైనది; భవతి – అగును; ప్రియః – ప్రియము; యజ్ఞః – యజ్ఞము; తపః – తపస్సు; తథా – అట్లే; దానం – దానము; తేషాం – వానిలో; భేదం – భేదమును; ఇమం – ఇట్టి; శృణు – వినుము.

*అనువాదం*

త్రిగుణముల ననుసరించి మనుజుడు భుజించు ఆహారము కూడా మూడు విధములుగానున్నది. అట్లే యజ్ఞము, దానము, తపస్సులు కూడా మూడువిధములుగా నున్నవి. ఇప్పుడు వాటి నడుమగల బేధమును ఆలకింపుము.

*భాష్యము*

ప్రకృతి త్రిగుణములయందలి వివిధ స్థితులననుసరించి ఆహారము, యజ్ఞాచరణము, తపస్సు, దానములందు భేదములు గలవు. అవి ఎన్నడును ఒకే స్థాయిలో ఒనరింపబడవు. ఏ కర్మలు ఏ గుణములో నిర్వహింపబడుచున్నవనెడి విషయమును విశ్లేషణాత్మకముగా అవగాహన చేసికొనినవాడే వాస్తవమునకు బుద్ధిమంతుడు. అట్లుగాక అన్ని రకములైన ఆహారములు, యజ్ఞములు, దానములు సమానమేయని భావించుచు భేదమునుగాంచవారలు మూఢులనబడుదురు. మనుజుడు తోచినదెల్ల చేయుచునే పూర్ణత్వమును పొందవచ్చునని ప్రచారము చేయు ప్రచారకులు సైతము కొందరుగలరు. అట్టి మూఢ ప్రచారకులు శాస్త్రనిర్దేశానుసారము వర్తించునట్టివారు కారు. తమకు తోచిన మార్గమును సృష్టించుచు వారు జనులను మోసగించుచున్నారు.

 

Gita Chapter 17 Verse 8

 

ఆయుఃసత్త్వబలారోగ్య-సుఖప్రీతివివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్త్వికప్రియాః ||

ప్రతి పదార్థం

ఆయుః – ఆయుష్షును; సత్త్వ – జీవితమును; బల – బలమును; ఆరోగ్య – ఆరోగ్యమును; సుఖ – సౌఖ్యమును; ప్రీతి – తృప్తిని; వివర్ధనాః – వృద్ధినొందించునట్టివి; రస్యాః – రసవంతములైనట్టివి; స్నిగ్ధాః – పుష్టికరములైనట్టివి; స్థిరాః – దృఢములైనట్టివి; హృద్యాః – మనోప్రీతిని కలిగించునట్టివి; ఆహారాః – ఆహారములు; సాత్త్వికప్రియాః – సత్త్వగుణమునందున్నవారికి ప్రియములైనవి.

అనువాదం

ఆయుఃప్రమాణమును పెంచునవి, జీవనమును పవిత్రమొనర్చునవి, బలమును, ఆరోగ్యమును, ఆనందమును, తృప్తిని కలిగించునవి అగు ఆహారములు సత్త్వగుణప్రధానులకు ప్రియమైనవి. అట్టి ఆహారములు రసపూర్ణములును, పుష్టికరములును, ఆరోగ్యకరములును, మనోప్రీతికరములును అయి యుండును.

 

Gita Chapter 17 Verse 9

 

కట్వమ్లలవణాత్యుష్ణ-తీక్ష్ణరూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః ||

ప్రతి పదార్థం

కటు – చేదైనట్టివి; ఆమ్ల – పులుపైనట్టివి; లవణ – ఉప్పుగానున్నట్టివి; అతిఉష్ణ – మిక్కిలి వేడిగానున్నట్టివి; తీక్ష్ణ – తీవ్రములైనట్టివి; రూక్ష – ఎండినట్టివి; విదాహినః – మంట కలిగించునట్టివి; ఆహారాః – ఆహారములు; రాజసస్య – రజోగుణమునందు ఉన్నవారికి; ఇష్టాః – ప్రీతికరములు; దుఃఖ – దుఃఖమును; శోక – క్లేశమును; ఆమయ – రోగమును; ప్రదాః – కలిగించునవి.

అనువాదం

మిక్కిలి చేదైనవి, అతి పులుపైనవి, ఉప్పుగా నున్నట్టివి, అతివేడివి, అతికారమైనవి, ఎండినట్టివి, మంట కలిగించునవియైన ఆహారములు రజోగుణమునందున్నవారికి ప్రియమైనట్టివి. అట్టి ఆహారములు దుఃఖమును, క్లేశమును, రోగమును కలిగించును.

భాష్యము

ఎప్పుడైతే శాకాహార పదార్థములను మితిమీరిన కారం/మిరపకాయలు, చెక్కెర, ఉప్పు వంటివి వేసి వండుతారో అవి రాజసికమైనవి అవుతాయి. వీటిని వివరించేటప్పుడు, ‘చాలా’ అన్న పదమును అన్ని విశేషణములకు ఉపయోగించవచ్చు. ఈ విధంగా, చాలా చేదైన, చాలా పుల్లని, చాలా ఉప్పగా, చాలా వేడిగా, చాలా ఘాటుగా, చాలా ఎండిన, చాలా కారంగా మొదలైనవి అన్నమాట. అవి అనారోగ్యమును, ఉద్వేగమును, మరియు నిస్పృహను కలుగచేస్తాయి. రజో గుణములో ఉండేవారు, అటువంటి ఆహారమును ఇష్టపడుతారు కానీ, అటువంటి ఆహారము సత్త్వ గుణములో ఉన్నవారికి వికారమైనవిగా అనిపిస్తాయి. ఆహారాన్ని భుజించటం అనేది నాలుకతో ఏదో ఆనందాన్ని అనుభవించటానికి కాదు, అది శరీరమును ఆరోగ్యముగా మరియు బలముగా ఉంచటానికి ఉపయోగపడాలి. ఒక ప్రాచీన నానుడి ఇలా పేర్కొంటుంది : ‘బ్రతకటానికి తినండి; తినటానికి బ్రతకొద్దు.’ అని. ఈ విధంగా, వివేకవంతులు చక్కటి ఆరోగ్యమునకు అనుగుణముగా ఉండే మరియు మనస్సుపై శాంతియుత ప్రభావం కలిగించే ఆహారాన్నే తీసుకుంటారు, అంటే సాత్త్విక ఆహారము అన్నమాట.

 

Gita Chapter 17 Verse 10

 

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||

ప్రతి పదార్థం

యాతయామం – తినుటకు మూడుగంటల ముందు వండినవి; గతరసం – రుచిలేనట్టివి; పూతిపర్యుషితం – చెడ్డవాసనతో కూడి క్రుళ్ళినట్టివి; చ – కూడా; యత్ – ఏది; ఉచ్ఛిష్టమపి – ఇతరులు తినగా మిగిలినవి; చ – మరియు; అమేధ్యం – స్పృశింపరానట్టిది; భోజనం – ఆహారము; తామసప్రియమ్ – తమోగుణమునందు ఉన్నవారికి ప్రీతికరము.

అనువాదం

భుజించుటకు మూడుగంటలకు ముందు తయారుచేయబడినవి, రుచిరహితము లైనవి, చెడిపోయినవి మరియు క్రుళ్ళినవి, ఎంగిలి మరియు నిషిద్ధపదార్థములను కలిగినట్టివియైన ఆహారములు తమోగుణులకు ప్రియమైనవి.

భాష్యము

ఆయుష్షును వృద్ధిచేయుట, మనస్సును పవిత్రమొనర్చుట, దేహమునకు శక్తిని కలిగించుటయే ఆహారము యొక్క ప్రయోజనమై యున్నది. అదియొక్కటే దాని ప్రయోజనము. ఆరోగ్యమునకు దోహదములై ఆయువును వృద్దినొందించునటువంటి పాలు, బియ్యము, గోధుమలు, పండ్లు, చక్కెర, కూరగాయలు వంటి ఆహారపదార్థములను స్వీకారయోగ్యములని పెద్దలు పూర్వము నిర్ణయించిరి. అట్టి ఆహారము సత్త్వగుణము నందున్నట్టివారికి మిక్కిలి ప్రియమై యుండును. పేలాలు మరియు బెల్లపు ముడిపదార్థమైన మొలాసిస్ వంటివి స్వత: రుచికరములు కాకున్నను పాలు మరియు ఇతర ఆహారపదార్థముల మిశ్రణముచే రుచికరములు, సత్త్వగుణసమన్వితములు కాగలవు. స్వతః పవిత్రములైన ఈ పదార్థములు నిషిద్ధములైన మద్యమాంసాదులకు మిక్కిలి భిన్నమైనవి. ఎనిమిదవ శ్లోకమున తెలుపబడిన స్నిగ్ధపదార్థములకు మరియు జంతువులను చంపగా లభించెడి క్రొవ్వు పదార్థములకు ఎట్టి సంబంధము లేదు. క్రొవ్వుపదార్థములు అత్యంత అద్భుతాహారమైన క్షీరరూపమున లభించుచున్నవి. పాలు, వెన్న, మీగడ వంటివి జంతువు యొక్క క్రొవ్వును వేరొక రూపమున అందించునటువంటివి. అవి అమాయకజీవులను వధించు అవసరమును నివారించుచున్నవి. కాని నిర్లక్ష్యకారణముననే జంతువులను వధించుటయనెడి కార్యము నిరాటంకముగా సాగుచున్నది. జీవనమునకు అవసరమైన క్రొవ్వుపదార్థములను పాల ద్వారా స్వీకరించుట నాగరికపధ్ధతి కాగా, జంతువధ యనునది మిక్కిలి అనాగరికమై యున్నది. పప్పులు, గోధుమల వంటి ఆహారములందు మాంసకృత్తులు పుష్కలముగా లభించును.

అతిచేదు, అతి లవణపూర్ణము, అతివేడి లేదా అతికారము కలిగిన రజోగుణ ఆహారము ఉదరమున జీర్ణరసములను తగ్గించి రోగమునకు కారణభూతమగును. అనగా అది దుఃఖమునే కలిగించును. తాజాగా లేనటువంటి ఆహారములే ముఖ్యముగా తమోగుణ ఆహారములుగా పరిగణింపబడును. భుజించుటకు మూడుగంటలకు పూర్వము తయారుచేయబడిన ఏ ఆహారమైనను (ఒక్క ప్రసాదము తప్ప) తమోగుణ ఆహారముగనే భావింపబడును. అట్టి ఆహారపదార్థములు క్రుళ్ళుట ఆరంభించినందున దుర్వాసనను కలిగియుండును. అది తమోగుణులను ఆకర్షించగా, సత్త్వగుణులు దాని నుండి విముఖులై యుందురు.

తొలుత భగవానునకు అర్పింపబడినదైనచో లేదా మహాత్ములైనవారు (ముఖ్యముగా ఆధ్యాత్మికగురువు) స్వీకరించినదైనచో ఉచ్ఛిష్టమగుదానిని భుజింపవచ్చును. లేని యెడల ఉచ్ఛిష్టము తమోగుణమైనదిగా భావింపబడును. అట్టిది నిక్కముగా రోగమునే కలిగించును. అవి తమోగుణములకు అతిప్రియములైనను సత్త్వగుణములచే అంటనైనను అంటబడవు. అనగా శ్రీకృష్ణభగవానునకు తొలుత అర్పింపబడిన ఆహారమే అత్యంత శ్రేష్టమైనది. కూరలు, ధాన్యము, క్షీరము మొదలగు పదార్థములతో తయారుచేయబడిన ఆహారమును తాను స్వీకరింతునని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీత యందు పలికియే యున్నాడు (పత్రం పుష్పం ఫలం తోయం). ఇట్టి కార్యమున అత్యంత ముఖ్యమైనది ప్రేమ మరియు భక్తియే. భగవానుడు వానినే స్వీకరించును. ప్రసాదమును సైతము ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేయవలెనని పేర్కొనబడినది. ఆ విధముగా శాస్త్రవిధులననుసరించి తయారు చేయబడి, కృష్ణునకు అర్పింపబడిన ఆహారము ఎంత కాలవ్యవధియైనను స్వీకరింప యోగ్యమే కాగలదు. అది దివ్యమై యుండుటయే అందులకు కారణము. కనుక సర్వులకు ఆహారమును పాప, రోగనిరోధకముగా, ఆహారయోగ్యముగా, రుచికరముగా నొనర్చుటకు మనుజుడు దానిని శ్రీకృష్ణభగవానునకు అర్పింపవలసియున్నది.

 

– 0 –

 

About Sanatana Dharma

ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः।
अनेन वेद्यं सच्छास्त्रमिति वेदान्तडिण्डिमः॥

Brahman alone is real; the universe is mithya – neither fully real nor unreal, but an appearance. The individual self (jiva) is none other than Brahman itself, not separate or different. This is the true teaching of the scriptures, as revealed by Vedanta. ~ Verse 20 from Brahma Jnānavali Māla

error: Content is protected !!

Discover more from Rachana Nadella-Somayajula

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading